అజిత్‌కు షాకిచ్చిన అమిత్‌ షా!

న్యూఢిల్లీ: ఎన్సీపీలో తిరుగుబాటు తెచ్చి బీజేపీతో జట్టుకట్టి.. ఆదరాబాదరాగా ఉప ముఖ్యమంత్రిగా అజిత్‌ పవార్‌ పదవీ స్వీకార ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. అజిత్‌ పవార్‌పై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈడీ కేసులు కూడా నమోదయ్యాయి. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 70 వేల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేసినట్టు ఆయన ఆరోపణలెదుర్కొంటున్నారు. ఈ కేసులను సాకుగా చూపి బీజేపీ అజిత్‌ను తమవైపు తిప్పుకున్నట్టు కథనాలు వచ్చాయి. అజిత్‌తో కలిసి దేవేంద్ర ఫడ్నవిస్‌ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాక.. ఈ కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రూ. 70వేల కోట్ల ఇరిగేషన్ స్కామ్‌ కేసులో అజిత్‌ పవార్‌కు ఏసీబీ క్లీన్ చిట్ ఇచ్చినట్టు కథనాలు వచ్చాయి. బీజేపీకి మద్దతునిచ్చినందుకు ప్రతిఫలంగా ఆయనను కేసుల నుంచి విముక్తి కల్పించినట్టు ఆరోపణలు కూడా గుప్పుమన్నాయి. అజిత్‌పై ఏసీబీ కేసుల ఎత్తివేత మీద శివసేన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది.